*** ఎవరు ఈ తిరుపతి ?
***రూ : కోటి రివార్డ్ ప్రకటించిన NIA
Mavoist Thirupathi :మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణంతో పార్టీ కి జరగాల్సిన నష్టం కంటే ఎక్కువనే జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం పార్టీకి సాధ్యం కాదనేది స్పష్టం. చర్చలకు వస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం అడుగు ముందుగు వేయడంలేదు. వెనక్కి తగ్గుతోంది. కానీ చర్చలకు వీసమంత కూడా అవకాశం ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రభుత్వంతో పోరాటమే మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం బలగాలు రోజు, రోజుకు ముందుకు దూసుకు వెళుతున్నాయి. బేస్ క్యాంపులతో లక్ష్యాన్ని సాధిస్తున్నాయి. పార్టీ చరిత్రలో కార్యదర్శులను నష్టపోలేదు. కానీ మొట్ట మొదటిసారి ఆ నష్టాన్ని మోయక తప్పడంలేదు.
మావోయిస్టు పార్టీలో మొదట 16 మంది పోలిట్ బ్యూరోలు ఉండేవారు. లొంగుబాటు, అనారోగ్యాలతో మరణం, ఎదురుకాల్పుల నేపథ్యంలో నలుగురు పొలిట్ బ్యూరోలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారు. వీరిలో మాజీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్ రావు, మల్లోజుల వేవుగోపాల్ రావు, తిప్పరి తిరుపతి, మిసిర్ బెస్రా ఉన్నారు. మిసిర్ బెస్రా ఒక్కడే ఝార్ఖండ్ నివాసి. మిగతా ముగ్గురు కూడా తెలంగాణ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నివాసులే కావడం విశేషం.
వయోభారం, అనారోగ్యం కారణంతోనే గణపతి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. వేణుగోపాల్ రావు కూడా అనారోగ్య సమస్యలతోనే ఇబ్బందిగా ఉన్నాడని సమాచారం. కార్యదర్శి భాద్యతలను నిర్వహించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో తిప్పరి తిరుపతి తోనే సాధ్యమవుతుందని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. ఇప్పుడు తిరుపతి లక్ష్యంగా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు పార్టీ నంబాల మరణంతో జరిగిన నష్టం నుంచి కోలుకునేలోపుననే తిరుపతిని కూడా మావోయిస్టు పార్టీకి దూరం చేయడానికి బలగాలు పావులు కదుపుతున్నాయి. తిప్పరి తిరుపతి పార్టీకి దూరమైన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తును ఊహించడం కష్టమేననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
తిప్పరి తిరుపతి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. కేంద్ర కమిటీ సభ్యుడు.అదనంగా మిలటరీ భాద్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నివాసి తిరుపతి. 1983 లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆకర్షితులయ్యాడు. డిగ్రీ పూర్తి కాకముందే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దళసభ్యుడి స్థాయి నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయి వరకు ఎదిగాడు. మిలీషియా జరిపే దాడుల్లో తిరుపతి నేర్పరి అనే పేరు ఉంది. తిరుపతి పై NIA రూ : కోటి రివార్డ్ ప్రకటించింది. ప్రధానమైన దాడుల్లో తిరుపతి పాత్ర ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. ఇప్పటివరకు పోలీస్ రికార్డ్ ల్లో తిరుపతి పేరు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో తిప్పరి తిరుపతి లక్ష్యంగా కేంద్ర పోలీస్ బలగాలు అడవుల్లో జల్లెడ పడుతుంటే ఏమవుతుందో వేచి చూడాల్సిందే.