lands : కొందరి స్వార్ధ పరుల వలన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ నేటికీ సైతం ఎక్కడో ఒకచోట అవుతూనే ఉన్నాయి. దీనివలన స్వార్థపరులు బాగానే ఉంటున్నారు. కానీ కొనుగోలు చేసిన వారు మాత్రమే సంతోషంగా ఉండలేక పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక పోతున్నారు. మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు సైతం రాష్ట్రంలోని ప్రజల నుంచి ఎక్కడో ఒకచోట నుంచి వస్తున్నాయి.
తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇటీవలనే సంబంధిత శాఖల అధికారులతో డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ లో ఉన్న లోపాలపై సమీక్షించారు. అందుకు తగిన సలహాలను, సూచనలను, సాంకేతిక అంశాలను కూడా తీసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ డబుల్ రిజిస్ట్రేషన్ లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ నిబంధనల్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా డబుల్ రిజిస్ట్రేషన్ పై చట్టసవరణ చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22 కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి చట్టాన్ని కూడా తీసుకురానున్నామని తెలిపారు.