crop : రైతులు ఎక్కువగా పత్తి, వరి, మిరప, మక్క, కంది పంటలను వేస్తుంటారు. వీటికి పెట్టుబడి ఎక్కువ. కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. లాభాలు కూడా అంతంగానే ఉంటవి. కానీ వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఉండి ఎక్కువ లాభాలు వచ్చే పంటలు కూడా అనేకంగా ఉన్నవి. అందులో వాము (ఓమ) పంట కూడా ఒకటి. కేవలం ఐదు నెలల కాలంలో ఖర్చులు పోను ఐదు లక్షల రూపాయల లాభం వచ్చే ఓమ పంట వైపు ఆకర్షితులవుతున్నారు రైతులు. ఇప్పుడు ఆ పంట గురించి తెలుసుకుందాం…..
వాము పంటను ఎలాంటి నేలలోనైనా వాము సాగు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి, తేలికపాటి నేలల్లో కూడా పంట దిగుబడి వస్తుంది. వాము పంటను ఆగష్టు లో వేసుకోవచ్చు. విత్తనాలు నాటిన తరువాత ప్రతి రెండు నెలలకు ఒకసారి కలుపు తీయాలి. ఒకదానికి నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను ఒకటి నుంచి ఒకటిన్నర లోతులో నాటుకోవాలి. సేంద్రీయ ఎరువులు ఎకరానికి 8 టన్నుల వరకు కాంపోస్ట్ సరిపోతుంది.
పంటకు ప్రతి 15 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. పెట్టుబడి విత్తనాలకు సుమారు రూ. 200, ఎరువులకు రూ. 8 వేలు, కూలీలకు దాదాపు రూ. 15 వేల వరకు అవుతుంది. సుమారుగా ఒక ఎకరానికి రూ. 25 వేల వరకు ఖర్చు అవుతుంది. క్వింటాలు వాము ధర మార్కెట్ లో ప్రస్తుతం సుమారు రూ. 19 వేల ధర ఉంది. కనీసం ఒక ఎకరాకు దాదాపు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఒక ఐదు ఎకరాల్లో వాము పంట పండిస్తే కనీసం 30 క్వింటాళ్ల వాము దిగుబడి వస్తుంది. ఈ లెక్కన సుమారు రూ. 5.5 లక్షల ఆదాయం ఆర్జించవచ్చు. ఇలా కేవలం ఐదు నెలల్లోనే రూ. 5 లక్షల ఆదాయం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.