Home » BJP : కమలనాథులకు భరోసా ఇవ్వని కమలం నేత

BJP : కమలనాథులకు భరోసా ఇవ్వని కమలం నేత

BJP : మంచిర్యాల జిల్లాలో మొట్ట మొదటిసారి కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన కమలనాథుల్లో ఉత్సహాన్ని నింపింది. కానీ భరోసా మాత్రం ఇవ్వలేదని పలువురు కమలనాథులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మధుకర్ ఆత్మ హత్య కు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యలను పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఆత్మ హత్యలు చేసుకునే వారు భారతీయ జనతా పార్టీకి అర్హత కాదు అని మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంత మేరకు అసంతృప్తికి గురయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కావాలని ఏ కార్యకర్త ఆత్మ హత్యకు పాల్పడడు. అంతే కాదు అతని కుటుంబాన్ని వీదిపాలు చేయడు. విధిలేని పరిస్థితుల్లోనే చావును ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చట్ట పరంగా అతనికి పార్టీ నుంచి రక్షణ ఏర్పడితే ఏ కార్యకర్త కూడా కుటుంబాన్ని విడిచి చావును కోరుకోడు.

కేంద్రానికి ఎనిమిది మంది ఎంపీలు, రాష్ట్రానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాష్ట్రము నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతే కాదు ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పార్టీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు, ఇక ఎమ్మెల్సీ ఉన్నారు. అంటే రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సరిపడేంత బలం కమలం పార్టీకి ఉంది. ఇంత బలగం ఉన్న పార్టీ నాయకుడు తన విలువైన రాజకీయ జీవితానికి పాడె కట్టడు. బిఎల్ సంతోష్ ను తెలంగాణ కోర్ట్ మెట్లు ఎక్కకుండా, పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా చట్టంతో అడ్డుకట్ట వేసింది పార్టీ. మధుకర్ విషయానికి వచ్చేసరికి జిల్లా కమిటీ ఆ విధంగా స్పందించి ఎందుకు కాపాడుకోలేదని పలువురు కమల నాథులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారులను సంప్రదించామని చెబుతున్నారు జిల్లా నేతలు. కానీ చట్టాన్ని మాత్రం సంప్రదించకపోవడమే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు జిల్లాలో వ్యక్తమవుతున్నాయి.

గతంలో పార్టీ జిల్లా కార్యదర్శి రజనీష్ జైన్ చిన్న విషయానికి అరెస్ట్ అయ్యాడు. అర్థరాత్రి అరెస్ట్ జరిగిన సంఘటన. ఆ సమయంలో అతని భార్య, కొడుకు (15) మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే జిల్లా నేతలు స్పందించలేదు. రాష్ట్ర నేతలు మాకు తెలియదని దాటవేశారు. చివరకు అతని కుటుంబ సభ్యులే హై కోర్ట్ ద్వారా బెయిల్ తెచ్చుకోవడం విశేషం.

ప్రస్తుత రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి బీజేపీ లో ఉన్నపుడు చెన్నూర్ నియోజక వర్గంలో పర్యటనకు వెలితే అప్పటి బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. అంతే కాదు అతని మీడియా వాహనంపై కూడా దాడి చేశారు. ఆ తరువాత బీజేపీ జిల్లా కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ పై బిఆర్ఎస్ నేతలు దాడి చేయగా అతని చేయి విరిగింది. ఇటీవల బీజేపీ కార్యకర్త జయరామారావ్ పై దాడి చేసి కొందరు తీవ్రంగా కొట్టారు. ఏడాది కిందట బూతు కమిటీ కార్యకర్తలు ఎనిమిది మంది పై దాడి జరిగింది.సాగునీటి కోసం లక్షెట్టిపేట లో బిఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అప్పుడు కూడా బీజేపీ నేతలపై కేసు నమోదయినది.

ఇంత నష్టపోయినప్పటికీ పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్నాం. కనీసం పార్టీ నుంచి కోర్టు ఖర్చులు కూడా ఆశించడం లేదు. అయినా ఆత్మహత్యలను కోరుకోలేదు. కేసు నమోదు విషయంలో చట్టం తన పని తానూ చేసుకుపోతుంది. అదే స్థాయిలో జిల్లా పార్టీ కూడా స్పందిస్తే మధూకర్ తన కుటుంబానికి దూరమయ్యేది కాదంటున్నారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు భరోసా ఇవ్వకుండా భాద పెట్టే పద్దతిలో ఉన్నాయంటున్నారు జిల్లాలోని పలువురు నేతలు, కార్యకర్తలు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *