Ustav : కర్ణాటక రాష్ట్రం సేడం పట్టణంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైనది. ఉత్సవాన్ని నిర్వహించడానికి 240 ఎకరాల్లో వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 6 తేదీ వరకు జరుగనున్నాయి. పట్టణంలో భారత మాత చిత్రపటాన్ని ఊరేగించారు. వందల సంఖ్యలో మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తుల చిత్రపటాలతో దేశభక్తి గీతాలను ఆలపిస్తూ కోలాటం, లేజిమ్ తో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలు కళాత్మక ప్రదర్శనలు ప్రదర్శించారు. పదుల సంఖ్యలో వచ్చిన జానపద బృందాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పురాతన స్మారక చిహ్నాలను ప్రదర్శించారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న సాధువులు, మహర్షుల చిత్రాలు అందరి దృష్టిని చిత్రాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తాయారు చేసిన రథం ముందు వరుసలో విద్యార్థులు చేసిన నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రథం ముందు భాగంలో చేపట్టిన డోలు మేళం, లంబాడి నృత్య బృందం, పురవంతి బృందాలు, హాలిగే మేళా బృందాలు, లెజిమ్ బృందాలు, ఘోష్ బృందాలు, రింగ్ డ్యాన్స్లు, గోంధాలీ బృందానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన తిరు సందర్శకులను మంత్ర ముగ్దులను చేశాయి. బీర్నహళ్లి రోడ్డుకు కుడివైపున 24 ఎకరాల స్థలంలో 70 వేల మంది కూర్చునేలా ‘అనుమంటప’ పేరుతో ప్రధాన వేదికను నిర్మించారు. ఈ ప్రధాన వేదిక నుంచే అథితులు ప్రసంగించనున్నారు. అదే వేదిక నుంచి అవార్డుల పంపిణీ తోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు.
మాణికేశ్వరి మంటపంలో ప్రేరణ, అవగాహన ఉపన్యాసాలతోపాటు చర్చాగోష్ఠి కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సిద్ధరామ జంబలదిన్ని మంటపం వద్ద సంగీత కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 11 ఎకరాల్లో 62 రకాల కూరగాయలు, 12 రకాల పూలు, చెరకు, జనపనార,తోపాటు పండ్ల మొక్కలను ప్రదర్శించే విధంగా వ్యవసాయ ప్రపంచం ఆవిష్కృత మయ్యింది. ఈ వ్యవసాయ క్షేత్రం నిర్మించడానికి గత మూడు నెలలుగా అక్కడ పంటలు సాగు చేయడం విశేషం. జనలోక్, సేవా లోక్లకు సంబంధించి మొత్తం 100 స్టాళ్లు, కుడివైపున కాయకా లోక్ల కోసం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స అందించడానికి 18 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. బీర్నహళ్లి రోడ్డుకు ఎడమవైపు ఎనిమిది ఎకరాల్లో సైన్స్ వరల్డ్ను నిర్మించారు. షాపింగ్ స్టాల్స్ రెండు ఎకరాలలో నిర్మించారు. 6,000 మందికి వసతి కల్పించేందుకు అన్ని వసతులతో కూడిన పట్టణాన్ని ఏర్పాటు చేశారు.
ఈ భారతీయ సంస్కృతి ఉత్సవ్ ఏర్పాట్లను చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదని సందర్శకులు సంబరపడిపోతున్నారు. ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నారు.