anchor shyamala : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘోర పరాజయం పాలైనది. కొందరు నాయకులు కూటమి వైపు చూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు భోగభాగ్యాలు అనుభవించారు. ప్రజలు దూరం పెట్టడంతో నాయకులు కూడా పార్టీకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకొని ఉన్న వారితో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెట్టుకు రావాలని చూస్తున్నారు. అందులో భాగంగా తనను నమ్ముకున్న వారికి కీలక పదవులను కట్టబెడుతున్నారు.
ఇప్పటికే కొందరికి జిల్లా అధ్యక్ష భాద్యతలను ఇటీవలనే అప్పగించారు. మరికొందరికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. సీనియర్లను పార్టీ సలహాదారులుగా నియమించారు. తాజాగా నలుగురికి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. కొత్తగా మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావులను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వీరితో పాటు ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామలను కూడా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
శ్యామల భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తరుపున విస్తృత ప్రచారం చేశారు శ్యామల. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగ గీత తరుపున ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసి వార్తల్లో కెక్కింది శ్యామల. పెద్ద నాయకులను ఢీకోట్టినప్పటికీ ఆమె ఎక్కడ కూడా భయపడ లేదు. రాజకీయంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికి తన ప్రయాణం వైసీపీ లోనే కొనసాగు తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి ఆమె ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి భాద్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల సమాచారం.