encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు వయోభారం. స్థావరాల గొడవలు. వీటన్నిటికీ తోడుగా ఎన్కౌంటర్లు. ఈ నేపథ్యంలో పార్టీ త్రిశంకుస్వర్గంలో పడిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో పార్టీ కీలక నేతలే నేలరాలుతున్నారు. కొత్తగా పార్టీలో చేరికలు లేవు. ఉన్నవాళ్లు పోలీస్ నిర్బంధాన్ని తట్టుకోలేక పోతున్నారు. పోలీస్ బలగాల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగింది. ఒకవైపు ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోవడంతో ఇబ్బందులు వెంటాడుతున్నాయి. మరోవైపు లొంగుబాట్లతో పార్టీ కుంగిపోతున్నది. గడిచిన ఆరేడు నెలల్లోనే 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.
మంగళవారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. అందులో కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర -ఛత్తీస్ఘడ్ బార్డర్ ఇన్చార్జిగా భాద్యతలు నిర్వహిస్తున్న తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా మృతిచెందినట్టు దంతెవాడ ఎస్పీ ప్రకటించారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన ఏసోబు 1980 లో మావోయిస్టు పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ బాధ్యతలతో పాటు అదనపు భాద్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఏసోబు భార్య లక్ష్మక్క అనారోగ్యంతో ఏడాది కిందటే చనిపోయింది. ఏసోబు కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
దాదా రణదీప్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలియడంతో టేకుల గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.