Ex CM Jagan : ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మాయిలకు జరిగిన అన్యాయం విషయంలో స్పందించడం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ప్రజాపాలనలో భాగస్వాములైన నాయకులే ఇబ్బంది కరంగా మాట్లాడితే సామాన్య మానవులకు ఇక దిక్కెవరు అనే ప్రశ్నలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ గుడ్లవల్లేరు కళాశాల సంఘటనపై ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలికిన చిలుక పలుకులు ఇవి. ఆడపిల్లల భదత్ర విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం సమ్మతమే. ప్రజాప్రతినిధిగా న్యాయబద్దంగా మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. కానీ బాలీవుడ్ నటి కాదంబరీ జేత్వాని విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏపీ లో గత మూడు రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో కాదంబరీ జేత్వాని చర్చ ఎక్కడ చూసిన వినబడు తోంది. జగన్ పరిపాలన కాలంలోనే ఆమెపై ఐపీఎస్ అధికారులు అక్రమ కేసులు నమోదు చేశారనే ఆరోపణలు వచ్చాయి. వేదింపులకు గురిచేశారని, కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారని జేత్వాని వాపోయింది. పోలీసులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసి కూడా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. నలబై రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారని గుర్తుకు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనది .
జేత్వాని ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించడానికి ముందుకు రావడంలేదు. చివరకు వైఎస్ జగన్ కూడా జేత్వాని విషయంలో స్పందించకపోవడం పై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ మాజీ సీఎం హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ గుడ్లవల్లేరు ఘటనపై ఎక్స్ వేదికగా తొందరగానే స్పందించడం విశేషం. గుడ్లవల్లేరు లో బాధితురాలు అమ్మాయే, జగన్ పరిపాలనలో వేధింపులకు గురైనది కూడా అమ్మాయే అనే విషయం జగన్ తెలిసి కూడా సరైన రీతిలో స్పందించకపోవడంపై విమర్శలు తలెత్తున్నాయి.