ys Jagan : వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఐదేళ్ల పరిపాలన. ఇప్పుడు అయన అధికారానికి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు నిత్యం అయన వెంట ఉంటూ కొందరు నాయకులు భజన చేశారు. ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఇన్నేళ్ళుగా దగ్గరగా ఉన్న వారంతా దూరం అయ్యారు. కానీ అప్పుడు ఉన్నవారిలో ఇప్పుడు కూడా కొందరు నమ్మకంగానే దగ్గరగా ఉంటున్నారు. నమ్ముకున్న వాళ్ళందరూ దూరం కావడంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారు.
జగన్ వద్ద ఇప్పుడు వేళ్ళమీద లెక్కించేంత మంది నాయకులే కనబడుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రమే దగ్గరగా ఉంటున్నారు. తాడేపల్లి కార్యాలయంలో కూడా వీళ్ళే కనబడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు పొందారు. రాజభోగాలు అనుభవించారు. అలాంటి నేతలంతా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
జగన్ కు దూరమైన వాళ్లంతా హైదరాబాద్ కు మకాం మార్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎదో చుట్టపు చూపుగా ఏపీ కి వచ్చివెళుతున్నట్టు సమాచారం. కొందరు ఇంటిపనులు చక్కదిద్దుకుంటున్నారు. రమ్మని కబురు పంపినా రావడం లేదంట. అనవసరపు ఖర్చు అని ఎదోసమాధానం చెప్పి తప్పించుకుంటున్నారని తెలిసింది. జగన్ పర్యటనల్లో కూడా నాయకులు దూరంగానే ఉంటున్నారు. జగన్ కు అతి నమ్మకస్తులు కూడా దూరంగా ఉండటానికి మరొక కారణం కూడా కనబడుతోంది. విజయవాడలో ఉంటె ఖర్చు ఎక్కువ అవుతుంది. అదేవిదంగా కేసులు తమ మెడకు ఎక్కడ పడుతాయోనని భయంతో దూరంగా నేతలు ఉంటున్నారు.
రాయలసీమ కు చెందిన నేతలు అనేక విధాలుగా లబ్ది పొందిన వారు సైతం దూరంగానే ఉన్నారు. ఓటమి చెందిన నాటి నుంచి నేటి వరకు అందరి ప్రవర్తన గమనిస్తున్న జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. 2029 లో ఎన్నికలు వచ్చేనాటి వరకు ఎవరైతే తన వెంట ఉంటారో వారికే పార్టీలో భవిష్యత్తు ఉంటదని జగన్ తన అనుచరులతో స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.