Home » BRS Party : చెన్నూర్ గులాబీల్లో మొదలైన గుబులు ….

BRS Party : చెన్నూర్ గులాబీల్లో మొదలైన గుబులు ….

BRS Party : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం. పదేళ్ల పాటు రాజభోగం. అధికారంతో గులాబీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కసారిగా అధికారం దూరమైనది. ఇప్పుడు అధికారం లేదు. కనీసం నియోజకవర్గం గులాబీ శ్రేణులను కాపాడుకోడానికి ఎమ్మెల్యే లేడు. ఎంపీ అంతకూ లేడు. చెన్నూర్ అసెంబ్లీ స్థానంతో పాటు, పార్లమెంట్ స్థానం కూడా బిఆర్ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల కష్ట, సుఖాలను పంచుకోడానికి నాయకుడు కరువైనాడనే అభిప్రాయాలు బిఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. కొందరు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికల కాలం. ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అధినేత కేసీఆర్ ఇల్లు విడిచి రావడంలేదు. కూతురు జైలు లో ఉండటంతో కేసీఆర్ ఆవేదనలో ఉన్నారు. కవిత బెయిల్ పై బయటకు వచ్చేవరకు పార్టీ సమస్యలను కేసీఆర్ పట్టించుకోరని తెలుస్తోంది. అదేవిదంగా నియోజక వర్గాలల్లో నాయకులు క్యాడర్ ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీని ఎదుర్కోడానికి బిఆర్ఎస్ క్యాడర్ చేస్తున్న మీడియా ప్రచారం కూడా అత్తెసరు గానే ఉంది.

మందమర్రి ఏరియాలో టీబీజీకేఎస్ కు చెందిన కొందరు నాయకులపై సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. టీబీజీకేఎస్ నాయకులు కొందరు ఇన్ని రోజులపాటు ఉపరితలంలో పనిచేసారు. ఇప్పుడు వారందరిని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి విధులు నిర్వహించాలని ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అదేవిదంగా మరొక టీబీజీకేఎస్ నాయకుడిని మణుగూరు కు బదిలీ చేశారని సమాచారం.
మందమర్రి లో బిఆర్ఎస్ నాయకుడు సింగరేణి క్వాటర్ లో ఉంటున్నాడు. ఆ ఇంటికి తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మందమర్రిలోనే మరో మూడు వందలకు పైగా కార్మికేతరులు కూడా అక్రమంగానే ఉంటున్నారు. కొందరు ఏకంగా రెండు నుంచి నాలుగు క్వాటర్ లు ఆక్రమించుకొని అద్దెకు ఇచ్చుకున్నారు. వాళ్లందరిపై ఎందుకు సింగరేణి అధికారులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్వాటర్ ల బాగోతం విజిలెన్స్ అధికారులకు, మందమర్రి అధికారులకు కనబడుత లేదా అని కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది.

ఇదంతా కూడా సింగరేణి అధికారుల విధినిర్వహణ, పరిపాలనలో భాగమే అవుతుంది. సింగరేణి సంస్థ పరంగా తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు కావచ్చు. లేదంటే పరిపాలనలో భాగం కావచ్చు. గడిచిన పదేళ్లు మౌనంగా ఉండి , ఇంత హఠాత్తుగా సింగరేణి అధికారులు ఎందుకు క్రమశిక్షణ చర్యలు చేపట్టారో కార్మిక వర్గానికి కూడా అంతుపట్టడంలేదు. కానీ ప్రభుత్వం మారిన తరువాతనే సింగరేణి అధికారులకు పరిపాలన, క్రమశిక్షణ, విధులు గుర్తుకు వచ్చాయా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చెన్నూర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో కొందరు గులాబీ శ్రేణులు గడప దాటడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన మాజీ జీడీపీటీసి ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. ఆ జెడ్పిటీసి తో పాటు మరి కొందరు కూడా నియోజకవర్గం కు చెందిన గులాబీ శ్రేణులు గడప దాటనున్నారని సమాచారం. పార్టీ అధిష్టానం స్పందించని నేపథ్యంలో చెన్నూర్ లో గులాబీ పార్టీ కనుమరుగు కావడం ఖాయమనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *