Congress Party : పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ శ్రేణులు అధికారానికి దూరమయ్యారు. ఎటూ వెళ్లినా పది వాహనాలు. చుట్టూ పదుల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు. వెంట ఆధునిక ఆయుధాలతో గన్ మ్యాన్ లు. చిటికేస్తే పరిగెత్తుకుంటూ వచ్చే అధికార వర్గం. ఇదంతా ఒక్కసారిగా కోల్పోవడంతో గులాబీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకున్నారు బిఆర్ఎస్ నాయకులు. సీఎం పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి నే టార్గెట్ చేయడంలేదు. ఆయన సోదరులను కూడా టార్గెట్ చేస్తున్నారు. అవినీతి మరకలు అంటించేందుకు ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. సీఎం విదేశీ పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ దూకుడు మరింత పెరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి ఛాలంజ్ గా తీసుకొని రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించినంత మేరకు రాష్ట్ర మంత్రి వర్గం ప్రచారం చేయడంలో విఫలమైనదనే అసంతృప్తి కూడా ఏర్పడింది. రుణమాఫీ అమలు చేసి తీరుతాం. హరిశ్ రావ్ రాజీనామాకు సిద్ధమా అంటూ సీఎం సవాల్ విసిరారు. సవాల్ కు తగ్గట్టుగా రుణమాఫీ అమలవుతోంది. కానీ హరీష్ రావ్ రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ తన ఆశయాలకు తగ్గట్టుగా నిలదీయకపోవడం విశేషం.
అసెంబ్లీ సమావేశాల్లో పేరు పెట్టకుండా సీఎం అక్కలూ అంటూ ప్రస్తావించారు. మహిళలను అవమానించారంటూ సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు బిఆర్ఎస్ నేతలు. సీఎంను సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు, కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు. మూసి నది అభివృద్ధి గురించి సీఎం సభలో చెప్పేవరకు కూడా బిఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టలేక పోయారు. ఏ ఒక్క మంత్రి కూడా పార్టీ ఆశించినంతగా తిప్పికొట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు స్పందించినంత కూడా పదవులు పొందిన వారు స్పందించకపోవడం పై పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన పలు కంపెనీలతో సంప్రదిస్తున్నారు. ఆ విషయాన్నీ కూడా గొప్పగా ప్రచారం చేయడంలో పార్టీ విఫలం అయ్యిందనే ఆరోపణలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం. బిఆర్ఎస్ శ్రేణులు తమ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పై విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలం అయ్యిందనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. అధికారం లోకి వచ్చిన తరువాత సోషల్ మీడియా పాత్ర తక్కువ అయ్యిందనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తం కావడం విశేషం