BRS Target : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం చేపట్టింది. తన బలం ఏమిటో ప్రతిపక్షాలకు చూపింది. కోరుకున్న విదంగా సొంతంగా 400 సీట్లు సాధించలేకపోయింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కూడా తనకు పెరిగిన బలమేంటో చూపించింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు రాష్ట్రంలో పెరిగిన బలంతో వణుకు మొదలైనదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బొక్క బోర్లా పడింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. రాబోయే ఐదేళ్లు ఆ పార్టీకి వనవాసమే మిగిలింది. అందనంత దూరంలోకి వెళ్లిన పార్టీ ని మరింత ఇరుకున పెట్టడానికే తాజా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను రంగంలోకి దించుతున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.
కేంద్రంలో రాష్ట్రము నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి మంత్రి వర్గంలో బెర్త్ దొరికింది. ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్ష భాద్యతలు కిషన్ రెడ్డి వద్దనే ఉన్నవి. 2028లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఎదుర్కోవాలంటే రాష్ట్రం పై గట్టి పట్టు ఉన్న నాయకుడు అవసరం. కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ కి ఇద్దరిలో ఒకరికి పార్టీ పదవి కట్టబెడితే కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి ని ఎదుర్కోవడానికి సమయం దొరకదు. ఒకవైపు కేంద్రంలో బాధ్యతలు, మరోవైపు రాష్ట్రంలో పార్టీ పదవి. కాబట్టి ఆ ఇద్దరితో ప్రధాన పార్టీలను ఎదుర్కోవడం కష్టమే అవుతుంది.
తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నంటే ఈటల రాజేందర్ ఉన్నారు. రాష్ట్రమంతా పర్యటించారు. రాష్ట్రంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించిన అనుభవం సైతం ఉంది. తాజాగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రములో అన్నివిధాలుగా పట్టున్న నాయకుడు. బిఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి మొదలుకొని రాష్ట్రంలోని అసెంబ్లీ స్థాయిలో ఉన్న నాయకుడి వరకు లోగుట్టు తెలిసిన నాయకుడు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉంటాయి. కాషాయం కండువా కప్పుకున్న నాటి నుంచి
పార్టీలో అనారోగ్యకరమైన వాతావరణానికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదనే పేరు ఉంది. కాబట్టి అధ్యక్ష భాద్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాడనే ఉద్దేశ్యంతోనే ఈటల వైపు ఢిల్లీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.