15న మందమర్రి ఏరియా కాసిపేట గనిపై సమావేశం
అనుమతి ఇవ్వని సింగరేణి అధికారులు
అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న TRS నేతలు
కార్మికుల గొంతునొక్కడేమంటున్న బోడ జనార్దన్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై వివాదం నెలకొంది. ఈ నెల 15న మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై నిర్వహించాలనుకున్న సమావేశానికి సింగరేణి అధికారులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కవిత పలు గనుల ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో భాగంగా జూన్ 15న కాసిపేట గనిపై కార్మికులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గని పరిసర ప్రాంతాల్లో భద్రతా, పరిపాలనా కారణాలను చూపుతూ సమావేశానికి అనుమతి ఇవ్వలేమని టిఆర్ఎస్ నాయకులకు సింగరేణి అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, కార్మికుల అభిప్రాయాలు వినేందుకు నిర్వహించే సమావేశాన్ని అడ్డుకోవడం సరైన విధానం కాదని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్మికుల గొంతుకను వినిపించకుండా చేసే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నామన్నారు.
మరోవైపు సింగరేణి అధికారులు మాత్రం గనుల ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయని, అనుమతులు ఇవ్వడం పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెబుతున్నారు. రాజకీయ సమావేశాలకు గని ప్రాంగణాలను వినియోగించడంపై ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయని, వాటి ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ రక్షణ సేన నాయకులు అధికారుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, కవిత పర్యటన యథావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశానికి ప్రత్యామ్నాయ వేదికను ఎంపిక చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.సింగరేణి ప్రాంతాల్లో కార్మిక సమస్యలు, ఉద్యోగ భద్రత, గనుల నిర్వహణ తదితర అంశాలపై కవిత చేపట్టనున్న పర్యటనకు ఈ అనుమతి వివాదం మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఈ అంశంపై రాజకీయంగా మరింత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

by