Singareni Award : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు అత్యుత్తమ అవార్డు లభించింది. 2023-2024 లో సంస్థ పనితీరుకు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ సంస్థ అందజేసింది. 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సమావేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో జరిగింది. ఈ సమావేశంలో అవార్డు అందజేశారు. సింగరేణి సి అండ్ ఎండి బలరాం తరపున ఆపరేషన్, పర్సనల్ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. 2023-2024 లో సింగరేణి అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల సమిష్టి కృషితో సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత సాధించింది. అదేవిదంగా చేపట్టిన రక్షణ చర్యలు కార్మికులకు మేలు చూశాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. బొగ్గు రవాణాలో కూడా సరికొత్త రికార్డు సాధించడం విశేషం. లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించడంతో సంస్థ రూ.35,700 కోట్ల టర్నోవర్ సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ జాతీయ స్థాయిలో సింగరేణి పేరు సంపాదించింది.ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ సంస్థ ప్రగతిని గుర్తించి ‘పెర్ఫార్మెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు -2024’ ను ప్రకటించి అందజేసింది.