Singareni : నిత్యజీవితంలో ప్రతిఒక్కరికి కాలుష్యరహిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుందని, అందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలను నాటాలని బెల్లంపల్లి రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘు కుమార్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో కార్మికుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలపై ఆధారపడిన మానవులు వాటిని పెంచడానికి తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలన్నారు.
ఏరియా రక్షణ అధికారి మాటూరి రవీందర్ మాట్లాడుతూ ఇప్పటికే ఆక్సిజన్ ను మనం కొనుక్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పరిస్థితులను అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. ప్రతి రోజు మన జీవితం ప్లాస్టిక్ తోనే జీవన సాగిస్తున్నమని వాటికి ముగింపు ఇవ్వాలని కార్మికులను కోరారు.కె కె గ్రూపు ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు రసాయనాలతో ఉంటాయి కాబట్టి భూమిలో కలసిపోవాలంటే వందల సంవత్సరాలు పడుతుందని తద్వారా భూమి సమతుల్యతలు దెబ్బతింటున్నాయని అన్నారు.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ గాలి,నీరు,భూమి కలుషితం చేస్తూ జీవరాసులను కనుమరుగుచేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని గని మేనేజర్ భూశంకరయ్య అన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణ వాయువుతో పాటు ఫలాలను,కలపను పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ, గ్రూప్ ఇంజనీర్ రాం ప్రసాద్, రక్షణ అధికారి నిఖిల్ అయ్యర్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి జీషాన్, అండర్ మేనేజర్ సుమన్ రెడ్డి , కార్మికులు పాల్గొన్నారు.