Singareni : సింగరేణి సంస్థలో భర్తీ చేయాల్సిన మెకానికల్ ఛార్జ్ హ్యాండ్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియా లోని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ ….
సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వెల్డర్, మెకానికల్ ఛార్జ్ హ్యాండ్ పోస్టులను సంస్థలో పని చేస్తున్న కార్మికులతో భర్తీ చేయడానికి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రకటన ఆధారంగా కార్మికులు నియామకం పరీక్షకు హాజరైనారు. ఇటీవల యాజమాన్యం వెల్డర్ ఫలితాలను వెల్లడించి మెకానికల్ ఛార్జ్ హ్యాండ్ ఫలితాలను వెల్లడించక పోవడానికి గల కారణాన్ని యజమాన్యం వెంటనే కార్మికులకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పరీక్షలు నిర్వహించి ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ మెకానికల్ ఛార్జ్ హ్యాండ్ ఫలితాలను యాజమాన్యం ప్రకటించకపోవడంతో కార్మికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కాబట్టి యాజమాన్యం వెంటనే మెకానికల్ ఛార్జ్ హ్యాండ్ ఫలితాలను ప్రకటించాలని ఈ సందర్బంగా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.