Home » బీబీపేటలో రహదారి విస్తరణ చేపట్టాలి

బీబీపేటలో రహదారి విస్తరణ చేపట్టాలి

ఇరుకు రహదారితో ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని బీబీపేట

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రమాదాలకు కారణమవుతున్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకుబుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

బీబీపేట ఎంట్రీ బంగ్లా నుంచి మండల కేంద్రం చివర ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు వరకు నాలుగు లైన్ల (ఫోర్‌లైన్) రహదారిని విస్తరించాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీబీపేట అభివృద్ధిపై హామీలు మాత్రమే ఇస్తున్నారని, కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొత్త మండలంగా ఏర్పడి 15 సంవత్సరాలకు పైగా గడిచినా బీబీపేట రూపురేఖలు మారకపోవడం బాధాకరమన్నారు. రహదారి సౌకర్యాల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

బీబీపేట మీదుగా సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ, రామంపేట, తుజాల్‌పూర్, మల్కాపూర్, ఇస్సానగర్, ఉప్పరపల్లి, జనగామ, కోనాపూర్, పెద్ద మల్లారెడ్డి, చలిమెడ, శివరామరెడ్డిపల్లి, షేర్ బీబీపేట తదితర గ్రామాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు ఉండటంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే ఫోర్‌లైన్ రహదారి నిర్మించి, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు వీధి విద్యుత్ దీపాలు (స్ట్రీట్ లైట్లు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి విస్తరణ, మరమ్మతులు చేపట్టి బీబీపేట అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కొరివి నరసింహులు విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *