Home » తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు..?

తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు..?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, కొత్త సీఎస్ ఎంపికపై గత కొద్దిరోజులుగా సచివాలయంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ రేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే, ఐటీ మరియు పురపాలక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ పేరు బలంగా వినిపించినప్పటికీ, చివరకు ప్రభుత్వం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడటం మాత్రమే మిగిలి ఉందని సమాచారం.

– క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఆయన విస్తృత పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు. గతంలో కేంద్ర రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వంలోని డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (DoNER) శాఖ కార్యదర్శిగా ఢిల్లీలో డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారి శశాంక్ గోయల్ త్వరలో పదవీ విరమణ చేయనుండటం, మరో సీనియర్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్‌లో ఉండటంతో సంజయ్ జాజు ఎంపికకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలో సంజయ్ జాజు కలిశారు. అలాగే ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మీసేవ’ (MeeSeva) పోర్టల్ రూపకల్పన, అమలులో సంజయ్ జాజు కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు కూడా లభించింది.

క్లీన్ ఇమేజ్, పరిపాలనా అనుభవం, కేంద్ర-రాష్ట్ర స్థాయిల్లో పనిచేసిన అనుభవం వంటి అంశాలు సంజయ్ జాజు పేరును సీఎస్ పదవికి బలమైన అభ్యర్థిగా నిలిపాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *