TDP : తెలంగాణలో పూర్వ వైభవం కోసం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది తెలుగు తమ్ముళ్ల నుంచి. ఆదివారం కూడా అధినేత చంద్రబాబు కూడా తన మనసులో మాటను బయట పెట్టారు. తెలంగాణ లో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామని ఆదివారం ప్రకటించారు. దింతో తెలుగు దేశం రాబోయే ఎన్నికల్లో బరిలో దిగడం పక్క అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రాష్ట్రం విడిపోయిన అనంతరం 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే గెలిచింది. 15 శాతం ఓట్లను సాధించింది. అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 2023 ఎన్నికల్లో పోటీచేయలేదు. ఏపీలో కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం, బీజేపీ తో జతకట్టడం తో టీడీపీ లో నైతిక బలం పెరిగింది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అప్పుడు టీడీపీలో ఉండి, ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న కొందరు ప్రథమ శ్రేణి నాయకుల్లో కొందరు బాబును కలిసి మంతనాలు జరిపారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బలమైన నేతలు కూడా అధ్యక్ష పదవి ఆశించారు. కానీ అప్పుడే ఆయన సున్నితంగా వెయిట్ అండ్ సీ అంటూ సుతి మెత్తగా దాట వేశారు. అదే సమయంలో మాజీ మంత్రి బాబు మోహన్ నేరుగా వెళ్లి పసుపు కండువా కప్పుకున్నారు.
గతంలో టీడీపీ లో ఉండి, ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులైన వారందరిని చేరదీసి మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. వాళ్ళతోనే నేరుగా మంతనాలు జరుపుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి తొందరలోనే బలమైన నేతను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేసి పార్టీని బలోపేతం చేయనున్నారని సమాచారం.