Mlc Kavitha : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ గులాబీ ప్రధాన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం ధర్నాకు దూరంగానే ఉన్నారు. కొందరైనా బిఆర్ఎస్ నేతలు హాజరవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ప్రథమశ్రేణి నాయకత్వంలో ఏ ఒక్కరు కూడా రాకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
కవిత చేపట్టిన ధర్నాకు వెళ్లరాదంటూ హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనే నాయకులు వెనుకడుగు వేశారనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు అండగా నిలబడటానికే కవిత ధర్నా చేపట్టారని, ధర్నాకు వెళ్లరాదంటూ ఆదేశాలు ఎందుకు వస్తాయని కూడా కొందరు గులాబీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కవిత దూకుడు వ్యవహారం గమనిస్తే పార్టీలో అంతర్గత కలహాలు పెద్దగానే ఉన్నాయనడానికి బలం చేకూరుతోంది.
గులాబీ జెండా నీడన రాజకీయం చేసేందుకు కవిత ఆసక్తిగా లేరని కూడా ఆమె మాటల్లో తెలుస్తోంది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన రోజే ఆమె ఘాటైన పదాలు వాడారు. నేనసలే మెండిదాన్ని అంటూ తనకు తానూ ప్రకటించుకున్నారు. అంటే ఆమె జైలులో ఉన్నప్పుడే కొత్త రాజకీయ వాతావరణానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఎవరి అండ లేకుండానే రాజకీయ ప్రకంపనలు రోజుకో పద్దతిలో సృష్టిస్తున్నారు కవిత. ఆమె అసలైన రాజకీయ అంతరంగం ఏమిటనేది కూడా రాజకీయవర్గాలకు అంతుపట్టడంలేదు. ఏది ఏమైనప్పటికి గులాబీ నేతలు లేకుండానే తన సొంత క్యాడర్ తో ధర్నా చేపట్టడంతో పార్టీకి తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేసిందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.