Tirumala : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంటగలిపారు. దేవుడి సొమ్మును దొరికినంత దోచుకొని పలువురు జేబులు నింపుకున్నారు. భక్తులకు ఇచ్చే దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రసాదంలో కలిపే నెయ్యి విషయంలో అయితే ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు.
తాజాగా మరో ఆరోపణ బయటకు వచ్చింది. వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడి ఎన్నికల ప్రచార ఖర్చులను టీటీడీ నుంచి కాజేశారు అనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దేవుడి బ్యాంక్ ను వైసీపీ బ్యాంకుగా మార్చి అప్రతిష్టను మూటగట్టుకున్నారని భక్తులు అసహ్యించుకుంటున్నారు.
ఒకవైపు నెయ్యి కుంభకోణం భక్తులు మరచిపోలేదు. ఇంతలోనే మరో కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి తులాభారం కానుకలను ఎత్తుకెళ్లారంటూ బీజేపీ నేత భాను ప్రకాష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా విజిలెన్స్ ఎస్పీకి అందజేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. తులాభారం కేసును విచారించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.