Home » Singareni : ఖనిజాల అన్వేషణలో సింగరేణి

Singareni : ఖనిజాల అన్వేషణలో సింగరేణి

దేశ అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర
ఖనిజ పరిశ్రమ రంగంలోకి సింగరేణి
జాతీయస్థాయి సదస్సులో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్

Singareni : సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా ఖనిజాల అన్వేషణలో కూడా కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతోందని సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో కీలక ఖనిజాలపై క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ……

గత కొన్నేళ్లుగా సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే చేస్తుందనే ప్రచారం ఉంది. కానీ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా అడుగుపెట్టిన తరువాత దేశ వ్యాప్తంగా సింగరేణి ప్రతిభ ఏమిటో పారిశ్రామిక వేత్తలకు కూడా తెలిసిపోయిందన్నారు. ఖనిజ పరిశ్రమలో కూడా అడుగుపెడుతున్నామని, తద్వారా దేశ అభివృద్ధిలో సింగరేణి పాత్ర కూడా కీలకం కాబోతున్నదని చైర్మన్ బలరాం స్పష్టం చేశారు.

2070 నాటికి భారత్ ను కర్బన ఉద్గార రహిత “ నెట్ జీరో ” దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది నెరవేరాలంటే దేశీయ ఖనిజ పరిశ్రమల వారు క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాల) ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. కీలక ఖనిజాల పై పరిశోధన, అన్వేషణ, ఉత్పత్తి వంటి విషయాలలో ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, సహకారం ఎంతో అవసరమన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం, సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగాల్లో కీలక ఖనిజాల వినియోగం ఎంతో ఎక్కువగా ఉందన్నారు. బ్యాటరీ వాహనాలు, సోలార్ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలకఖనిజాలకు అనూహ్యంగా ఉత్పత్తి డిమాండ్ ఏర్పడిందన్నారు

భవిష్యత్తులో సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా కీలక ఖనిజాల అన్వేషణ మరియు ఉత్పత్తి రంగాల్లో కూడా అడుగు పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సదస్సులో స్పష్టం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి విడుదలయ్యే ఫ్లై యాష్, క్లే మరియు ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ నుండి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను వెలికి తీసే అంశంపై పరిశోధనలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఈ సదస్సులో ఐఐటీ హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఎస్‌.మూర్తి, సింగరేణి ఈడీ కోల్ మూమెంట్, జీ.ఎం కో-ఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని, క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ అసోసియేష‌న్ ఇండియా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ చైత‌న్య‌మొయి గంగూలీ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ సందీప్ హామిల్ట‌న్, సింగరేణి జీ.ఎం లు మనోహర్, నారాయణరావు, మిథానీ, న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కార్పోరేష‌న్, వేదంతా త‌దిత‌ర కంపెనీల అధికారులు, ఐ.ఐ.టి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *