Srisailam: శ్రీ శైలం మహా పుణ్యక్షేత్రం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రధానమైన పండుగలతో పాటు శివరాత్రి, కార్తీక్ పౌర్ణమి, శ్రావణ మాసములో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అదే విదంగా సెలవు రోజుల్లో కూడా భక్తులు శివుడి దర్శనం కోసం తరలివస్తారు. ఈ రద్దీని తట్టుకోడానికి ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లలో ఎక్కడ కూడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఫిబ్రవరిలో మహాశివరాత్రి వేడుకలు రాబోతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పర్వదినం రోజు నుంచి మొదలు కొని పదకొండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం ఈవో శ్రీనివాస రావు రెవిన్యూ, పోలీస్, ఎండోమెంట్, అటవీశాఖ, ఆలయ నిర్వాహకులతో పాటు వేదపండితులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శివరాత్రి సందర్బంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ పదకొండు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పదకొండు రోజుల పాటు భక్తులకు వసతులు ఏర్పాటు చేయడంలో ఈవో పర్యవేక్షణలో పనులు ప్రారంభమైనాయి. పందిళ్లు, తాగునీరు, గదులు, ఉచిత భోజనం, క్యూ లైన్ లు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా పదకొండు రోజుల పాటు అందుబాటులో ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భాద్యతలు నిర్వహించాలని ఈఓ శ్రీనివాస రావు ఆదేశాలు జారీచేశారు.