Ex CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గోరపరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ అధినేత జగన్ కు ఓటమి రుచించడంలేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి. మరోవైపు కూటమి అధికారం. ఈ రెండింటిని తట్టుకొని రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తను ఒక్కడితో సాధ్యమయ్యే పని కాదు. ఇతరుల పోటీ తట్టుకోవాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఆ ఎత్తులు వేయడానికి ఒక వ్యూహకర్త కావాలి. ఆ వ్యూహకర్త కోసం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరాటపడుతున్నారు.
వైసీపీ ని కాపాడుకోడానికి జగన్ కొందరు నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక వ్యూహకర్తను నియమించుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా పార్టీలో ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ సలహాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు కూడా . ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిన సునీల్ కనుగోలు వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్టు వైసీపీ లో చర్చ నడుస్తోంది.
తెలంగాణలో అట్టడుగు స్థాయికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ పాత్ర కీలకం అయ్యింది. పార్టీని ముందువరుసలోకి తీసుకురావడానికి జగన్ తో సాధ్యమయ్యే పని కాదు. అందుకే సునీల్ కనుగోలు ను పార్టీ వ్యూహకర్తగా నియమించు కోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు అంగీకరిస్తారా ? లేదా ? అనేది పార్టీలో పెద్ద ఫజిల్.
ఇప్పటికే సునీల్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా సునీల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. ఏఐసిసి స్థాయిలో సునీల్ కు పెట్టింది పేరు. అతని మాటకు ప్రాధాన్యత ఉంది. ఒకవేళ జగన్ కోరితే అయన సేవలు అందించడానికి నిరాకరించవచ్చనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి.