Malkajigiri : తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు. అందులో మల్కాజిగిరి ఒకటి. ఈ నియోజకవర్గం అంత ఆషామాషీ కాదు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉన్నారు. అంతేకాదు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇక్కడ నిలయం కూడా. ఇప్పుడు ఈ నియోజకవర్గం పై దేశంలోని వివిధ పార్టీల దృష్టి పడింది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయన స్థానంలో గెలిచి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను దెబ్బతీయాలని బీజేపీ తోపాటు బిఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో సీఎం ఉన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. లక్ష్మారెడ్డి గెలుపు కోసం గులాబీ శ్రేణులు చెమటోడ్చారు. పట్నం సునీత కోసం సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ప్రచారం చేశారు. అదేవిదంగా ఈటల రాజేందర్ గెలుపు కోసం స్వయంగా ప్రధాన మంత్రి మోదీ వచ్చి ప్రచారం చేశారు. అంటే మల్కాజిగిరి స్థానం దక్కించుకోవాలనే కసి బీజేపీ శ్రేణుల్లో ఎంత ఉందొ తెలిసిపోయింది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడింటిని గులాబీ శ్రేణులే దక్కించుకోవడం విశేషం. కానీ సర్వేలు మాత్రం కాషాయం అభ్యర్థి వైపే ఓటర్లు ఉన్నారని చెబుతున్నాయి.
కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థుల నుంచి బీజేపీ ఆశించినంత పోటీ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జరిగిన పోలింగ్ గణాంకాల మేరకు ఈటల రాజేందర్ కు 46 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థికే మెజార్టీ దక్కే అవకాశం కూడా ఉందని పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. అదేవిదంగా రాజేందర్ కు బీసీ వర్గాలు సైతం అండగా నిలిచాయి. బీజేపీ 45-55, కాంగ్రెస్ 25-30, బిఆర్ఎస్ 15-20 శాతం మధ్య ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ గణాంకాలు చెబుతున్నాయి.
మల్కాజిగిరి స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ దక్కించుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పరువు దక్కుతుంది. ఒకవేళ చేయి దాటిపోతే మాత్రం ప్రతిపక్ష పార్టీలకు నిత్యం పండుగే అవుతుంది. సర్వే లు మాత్రం మల్కాజిగిరి స్థానంతో కాంగ్రెస్ కు ముప్పు తప్పదనే చెప్పడం విశేషం.