యూనియన్ బ్యాంకులో రద్దీతో రైతులకు తీవ్ర ఇబ్బందులు
సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
స్థానిక రైతులు, ఖాతాదారులు బ్యాంకింగ్ సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరొక బ్యాంకు ను ఏర్పాటు చేయాలని బీబీపేట మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగ వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ
బీబీపేటలో యూనియన్ బ్యాంకు ఒక్కటే ప్రధానంగా అందుబాటులో ఉండటంతో రైతులు తమ బ్యాంకింగ్ లావాదేవీల కోసం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సహకార (సొసైటీ) బ్యాంకు ఉన్నప్పటికీ రైతుల అవసరాలకు అవి సరిపోవడం లేదని పేర్కొన్నారు.
వడ్ల కొనుగోలు నగదు చెల్లింపులు, రైతు రుణాలు, పంట రుణాలు (క్రాప్ లోన్లు) తదితర సేవల కోసం రైతులు అధిక సంఖ్యలో యూనియన్ బ్యాంకును ఆశ్రయిస్తుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడి పనులు సకాలంలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా రైతులు బ్యాంకు చుట్టూ తిరగడంతో వ్యవసాయ పనులు సకాలంలో చేసుకోలేకపోతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నరసింహులు భర్త యూనియన్ బ్యాంకు వద్దకు వెళ్లి రైతులు, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో వెంటనే మరొక బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

by