తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుదల..
సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ టికెట్ల జారీ నిలిపివేత
కోల్ బెల్ట్ న్యూస్ (తిరుమల):
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ రికార్డు సాధించాడు. తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో సుమారు లక్షన్నర మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి అధికార వర్గాల సమాచారం. ఆదివారం కూడా ఇదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు సోమవారం (జూన్ 29) వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ టికెట్ల జారీని కూడా నిలిపివేసింది.
అదేవిధంగా, ఆదివారం వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తుల రద్దీ దృష్ట్యా సాధారణ దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున, భక్తులు టీటీడీ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

by