Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రివర్గ సహచరులతోపాటు, సంబంధిత శాఖల అధికారులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు. నిధులు కోసం కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. భాద్యతలు చేపట్టిన వెంటనే సీఎం విదేశీ పర్యటన చేపట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల్లోని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లోని ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలోనే ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి కూడా విదేశాల్లో అడుగుపెట్టాడు. కొండల్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్నారు. అయితే, కొండల్ రెడ్డి విదేశీ పర్యటన అధికారికంగా జరుగుతున్నదా ? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. మరోవైపు జర్నలిస్టులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన చేపట్టారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. బిఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం కొండల్ రెడ్డి పర్యటనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతోంది. అధికారిక పర్యటనా ? లేదంటే వ్యక్తిగత పర్యటననా అంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా లో విమర్శలు గుప్పిస్తోంది.
వాస్తవాలను తెలుసుకోకుండా బిఆర్ఎస్ సోషల్ మీడియా లో విమర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీటుగా స్పందిస్తున్నారు. కొండల్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నది వాస్తవమే కానీ, ఆయనది వ్యక్తిగత పర్యటన. అంత మాత్రాన కుటుంబ పాలన, అధికారిక పర్యటన అంటూ సోషల్ మీడియా లో విమర్శించడం బిఆర్ఎస్ నాయకుల చేతకాని తనానికి తార్కాణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ సంస్థ ఆస్ట్రేలియాలో స్థాపించి పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ ఉత్సవాలకు కొండల్ రెడ్డి ని ఆహ్వానించారు. ఆహ్వానం వచ్చిన నేపథ్యంలోనే కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఇదే ఆహ్వానం వరంగల్ జిల్లా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి వచ్చింది.
ఆ ఎమ్మెల్యే తనతో పాటు అయన నియోజక వర్గం పరిధిలోని జర్నలిస్టులను సైతం ఆస్ట్రేలియా తీసుకెళ్లారు. వారితో పాటు మరికొందరికి ఆహ్వానం రావడంతో వారు కూడా వెళ్లారు. కొండల్ రెడ్డిని వీళ్ళు కూడా ఆస్ట్రేలియా లో కలుసు కున్నారు. అక్కడ ఉన్న కొన్ని చూడదగిన ప్రాంతాలను అందరు కలిసి సందర్శించారు. దింతో ఇది పూర్తిగా కొండల్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అని తేలిపోయింది.