CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 4:43 pm Posted By: coalbelt 24 News

జట్టు కోసం ఆడాలి.. జిల్లాకు గౌరవం తేవాలి

మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

క్రీడాకారులు తమ ప్రతిభ, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎంపిక కావాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు అన్నారు. ఆదివారం మందమర్రిలో మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ అండర్‌–14, అండర్‌–17 బాల, బాలికల సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుంగపిండి రాజలింగు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపిక పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడు తనలోని నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. “మీపై నమ్మకం పెట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టండి. మీ ప్రతిభను నిర్భయంగా ప్రదర్శించండి. మీ లక్ష్యం జట్టు కోసం ఆడటం, జిల్లాకు గౌరవం తీసుకురావడం కావాలి” అని క్రీడాకారులకు ప్రేరణనిచ్చారు.

జిల్లా జట్టులో ఎంపిక కావడం బాధ్యత కూడా………

ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కోశాధికారి కనపర్తి రమేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనడం ఒక అవకాశం మాత్రమే కాకుండా బాధ్యత కూడా అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మైదానంలో చేసే ప్రతి ప్రయత్నం వారి కృషికి ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

క్రీడలతో పాటు మాట తీరు, ప్రవర్తన, నడవడిక, క్రమశిక్షణ విషయంలోనూ క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. క్రీడాకారుడి ప్రవర్తనపై తల్లిదండ్రులు, గురువులు, కోచ్‌లు, సంబంధిత సంస్థల గౌరవ ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటాయని అన్నారు.

విజయం సాధించినప్పుడు వినయంగా ఉండాలని, ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా దానిని ఒక పాఠంగా తీసుకోవాలని రమేష్ సూచించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

రమేష్ ఇచ్చిన ప్రోత్సాహకరమైన మాటలతో క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది. సెలక్షన్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ రాం వేణు, పీడీ ఆకృతి, ప్రవీణ్, పీఈటీలు అంకిల, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});