ప్రకృతి పదార్థాల వినియోగంపై ‘ప్రకృతిమిత్ర’ అవగాహన కార్యక్రమాలు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వినాయక నవరాత్రులు కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక మండపాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ‘ప్రకృతిమిత్ర’ తెలంగాణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నస్పూర్ కలెక్టరేట్ రోడ్డులోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండపం వద్ద ప్రకృతిమిత్ర సభ్యులు పర్యావరణహిత వస్తువులను ప్రదర్శించారు.
ఆకు దొప్పలు, అరికే ఆకు పళ్లాలు, బట్ట సంచులు, జనపనార సంచులు, కాగితం సంచులు, స్టీల్ పళ్లాలు, గ్లాసులు, విస్తరాకులను ప్రదర్శించి వాటి వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించారు. ‘ప్లాస్టిక్ వద్దు.. ప్రకృతి పదార్థాలే ముద్దు’, ‘పూజల్లో థర్మాకోల్ పళ్లాలు వద్దు.. ఆకు దొప్పలే ముద్దు’, ‘వెదురు బుట్టలు, మట్టి పాత్రలు వినియోగిద్దాం.. సంపూర్ణ భక్తిని పొందుదాం’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రకృతిమిత్ర తెలంగాణ వ్యవస్థాపకులు, ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ పవిత్రమైన వినాయక మండపాల్లో ప్లాస్టిక్కు చోటు ఉండకూడదన్నారు. ప్రసాద వితరణలో మార్కెట్లో లభించే ప్రకృతి సిద్ధమైన వస్తువులను వినియోగించాలని సూచించారు. ప్రకృతి పదార్థాలు సులభంగా మట్టిలో కలిసిపోతాయని, పర్యావరణానికి హాని కలిగించవని తెలిపారు. మండపాల నిర్వాహకులు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా సహజసిద్ధమైన పసుపు, కుంకుమ, పూలను మాత్రమే వినియోగించాలని, రసాయన రంగులను ఉపయోగించి నదులు, జలాశయాలను కలుషితం చేయవద్దని సూచించారు.
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, హౌసింగ్ సొసైటీ కాలనీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరం నుంచే తమ మండపంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ప్రకృతిమిత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలను పర్యావరణ పరిరక్షణ వైపు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రకృతిమిత్ర సభ్యులు కస్తూరి నాగేశ్వర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, టి. సంపత్కుమార్, కె. రాజమౌళి, వెంకటేశం, నాన్నయ్య, స్వర్ణలత, సునీత, నీరజ, కమల, పద్మాంజలి, వినాయక మండలి సభ్యులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});