CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:41 pm Posted By: coalbelt 24 News

సింగరేణిలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
సురక్షిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి:
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కోసం మితవాదులు, అతివాదులు, వివిధ వర్గాల ప్రజలు తమతమ మార్గాల్లో పోరాటాలు సాగించారని గుర్తుచేశారు. నిజాం సంస్థాన పాలన నుంచి అనేక త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల అనంతరం తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించారని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు.

ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దినప్పుడే పూర్వీకుల త్యాగాలకు సార్థకత చేకూరుతుందని అన్నారు. సింగరేణి ఉద్యోగులు తమకు కేటాయించిన విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రక్షణకు ప్రాధాన్యమిస్తూ బొగ్గు ఉత్పత్తి సాధించాలని పిలుపునిచ్చారు. సురక్షిత బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఆర్థిక పురోగతికి సింగరేణి ఉద్యోగులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, సీఎంఓఏఐ జాయింట్ సెక్రెటరీ రవి, సీనియర్ పీవో సత్యనారాయణ, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సీవీ రమణతో పాటు జీఎం కార్యాలయ హెచ్‌ఓడీలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});