CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 2:50 pm Posted By: coalbelt 24 News

మందమర్రిలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. 1948లో నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజుగా ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. విమోచనతో తెలంగాణ ప్రజలకు స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, స్వీయ పాలనకు మార్గం సుగమమైందని అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం, ఏకత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ రోజు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ తమ బాధ్యతలను గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి

మందమర్రి పట్టణ అభివృద్ధిలో ప్రజలు చురుకైన భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. పట్టణంలో శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మంచినీటి సరఫరా, సురక్షిత వాతావరణం, పౌర సదుపాయాలు, రహదారుల అభివృద్ధి తదితర రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల సహకారంతో విజయవంతంగా అమలు చేసుకుందామని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే మందమర్రి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దవచ్చని రాజలింగు పేర్కొన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో, దేశ స్వాతంత్ర్య సాధనలో త్యాగాలు చేసిన సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.

అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల హాజరు

కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సాయికిరణ్, రెవెన్యూ ఆఫీసర్ పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ టి. రాజేశ్వరి, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ. వసంత్, సీనియర్ అసిస్టెంట్లు ఏ. రాణి, ఈ. రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ ఎం.ఏ. సమీర్, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా విభాగం ఇన్‌చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ రఘురాం, 24 వార్డుల రిసోర్స్ పర్సన్స్, మెప్మా సిబ్బంది తదితర మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});