తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి: కే. రాజన్న
కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను ‘విద్రోహ దినం’గా పాటిస్తూ గోదావరిఖనిలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో గురువారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
రైతాంగ పోరాటంతో గ్రామాల విముక్తి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు కొనసాగిందని కే. రాజన్న తెలిపారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఈ పోరాటంలో సుమారు 3,000 గ్రామాలను విముక్తి చేసి, పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచినట్లు పేర్కొన్నారు. ఈ పోరాటంలో సుమారు 4,000 మంది అమరులయ్యారని తెలిపారు. తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం, భూస్వాముల అరాచకానికి, వెట్టి చాకిరీకి, బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారని రాజన్న పేర్కొన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ విమర్శ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పక్కదోవ పట్టిస్తున్నాయని కే. రాజన్న విమర్శించారు. అమర వీరుల త్యాగాలను, ప్రజా పోరాటాలను విస్మరించి ‘విలీనం’, ‘విమోచనం’ పేర్లతో చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ దృష్టిలో సెప్టెంబర్ 17 ముమ్మాటికీ ‘విద్రోహ దినమే’ అని ఆయన అన్నారు.
ప్రజా ఉద్యమాలు నిర్మించాలి
దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని కే. రాజన్న పిలుపునిచ్చారు. ఈ సభలో ఎస్సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈ. నరేష్, ఉపాధ్యక్షుడు చిలుక శంకర్, ప్రధాన కార్యదర్శి బి. అశోక్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, ఉపాధ్యక్షుడు మేరుగు చంద్రయ్య, నాయకులు ఐ. రాజేశం, ఎం. దుర్గయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు బతుకుల రాజన్న, కాసర్ల మల్లేష్, ఎం. కొమరయ్య, కోట వెంకన్న, పోగుల శేఖర్, రామారావు, జనగామ రాజన్న, చంటి బానయ్య, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});