భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను మందమర్రి ఎల్లందు క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణతో పాటు అధికారులు, ఇంజనీర్లు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ దేశ నిర్మాణంతో పాటు నీటిపారుదల, ఇంజనీరింగ్ రంగాల అభివృద్ధికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఆయన పాటించిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం, పనితీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి సంస్థ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని జీఎం రాధాకృష్ణ అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భద్రతకు ప్రాధాన్యమిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఇంజనీర్లకు సూచించారు.
కార్యక్రమం అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని జీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం), ఏజీఎం బాలాజీ భగవతి, ఏరియా ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు, ఏజీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ఏరియా ఇంజనీర్లు, డీవైపీఎంవో పీవోలు, సీనియర్ పీవోలు తదితరులు పాల్గొన్నారు.