రాజకీయ బలాబలాల ప్రదర్శనకు కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలి
టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు చూపించే వేదికగా ఉండాలే తప్ప అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను నిరూపించుకునే వేదికగా మారకూడదని టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల తీరును పరిశీలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలకే అధిక ప్రాధాన్యత లభిస్తున్నట్లు ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలే ప్రధాన చర్చాంశాలుగా ఉండాలని అన్నారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు, నిరుద్యోగ సమస్య, రైతుల ఇబ్బందులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా సమస్యలపై సమాధానాలు ఇవ్వడం కంటే రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని అభిప్రాయ పడ్డారు.అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా ప్రజల సమస్యలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించి, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పేలా చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి, సమస్యలకు పరిష్కారం లభించేలా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు, రాజకీయ బలాబలాల ప్రదర్శనను కోరుకోవడం లేదని, తమ సమస్యలపై చర్చ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలనే ఆశిస్తున్నారని సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలు కల్పించిన అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకోవాలని, అసెంబ్లీని రాజకీయ పోరాట వేదికగా కాకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజల సమస్యలే అసెంబ్లీ చర్చలకు కేంద్ర బిందువుగా ఉండాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});