కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మార్కెట్లో వ్యాపార సముదాయాల ముందు ఉన్న నాళాలను కబ్జా చేసి షెడ్లు నిర్మించడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అన్నారు. అంతేకాకుండా విద్యుత్ తీగల సమీపంలో నిర్మాణాలు చేపట్టడంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మందమర్రి నోడల్ అధికారి ఎన్. రాజేశ్వర్కు బీఎస్పీ నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నాళాలను ఆక్రమించి నిర్మించిన షెడ్ల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు మందమర్రి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, నోటీసులు జారీ చేయడం మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా రవాణాకు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, మందమర్రి మండల అధ్యక్షుడు ఎం.డి. రహీం బాబా తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});