కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
మేరా యువ భారత్ (మై భారత్) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజశేఖర్, జిల్లా స్పోర్ట్స్ నోడల్ ఆఫీసర్ సుధారాణి, జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ భారత హాకీ దిగ్గజం, క్రీడా రంగంలో చిరస్మరణీయ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థులు, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను మై భారత్ జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. స్థానికంగా ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
“ఆడుదాం – ఆరోగ్యంగా ఉండుదాం, క్రీడలతో దేశాన్ని బలోపేతం చేద్దాం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు కోడి అజయ్, ఉభయ్రెడ్డి, వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు, క్రీడా కోచ్లు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});