మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు నిండే అవకాశం
బీబీపేట్ మండల రైతుల్లో ఆనందం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం చెరువులో నీటిమట్టం సుమారు 11 అడుగులకు చేరుకోగా, గతంతో పోలిస్తే ఒక అడుగు మేర నీరు పెరిగినట్లు స్థానికులు తెలిపారు.
చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే మరో నాలుగు అడుగుల మేర నీరు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఇదే విధంగా వర్షాలు కొనసాగి ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చి చేరితే త్వరలోనే చెరువు నిండే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి పెద్దఎత్తున నీరు చేరుతుండటంతో బీబీపేట్ పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం నెలకొంది. పెద్ద చెరువు నిండితే బీబీపేట్ పరిధిలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటి భరోసా లభించే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. చెరువులో నీటి నిల్వ పెరగడం వల్ల భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

ఈ సందర్భంగా బీబీపేట్ మండల నాయకుడు కొరివి నరసింహులు మాట్లాడుతూ.. పెద్ద చెరువుపై ఆధారపడి వేల ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. చెరువుకు పూర్తిస్థాయిలో నీరు చేరేలా శాశ్వత నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. బీబీపేట్ పెద్ద చెరువుకు సంబంధించిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చెరువులో నీటి నిల్వ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్లో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. మరో నాలుగు అడుగుల నీరు చేరి చెరువు పూర్తిగా నిండితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});