CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:32 pm Posted By: coalbelt 24 News

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ఓపెన్ బాక్స్’

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా **‘ఓపెన్ బాక్స్’**ను ఏర్పాటు చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా, అది ప్రభుత్వ శాఖలకు సంబంధించినదైనా, స్థానిక సమస్య అయినా, పార్టీ కార్యకర్తలపై ఫిర్యాదు అయినా, చివరకు తనపై ఫిర్యాదు ఉన్నా ఎలాంటి భయం, సంకోచం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

చెన్నూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ బాక్స్‌లో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను రాతపూర్వకంగా వేసి వెళ్లాలని సూచించారు. ఈ బాక్స్ తాళం తన వద్దే ఉంటుందని, తానే స్వయంగా బాక్స్‌ను తెరిచి అందులోని ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తానని తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారికి తగిన సమాధానం అందిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});