కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):
బెల్లంపల్లి పట్టణంలోని 28 వార్డు హనుమాన్ బస్తీలో మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బస్తీ వాసులు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బస్తీ ప్రజలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ బస్తీకి మాత్రం మిషన్ భగీరథ పైప్లైన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణంలోని అనేక ప్రాంతాలకు పైప్లైన్లు అందించినప్పటికీ, వన్టౌన్ వెనుక ఉన్న తమ గల్లీకి మాత్రం ఇప్పటివరకు పైప్లైన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. పైప్లైన్ కోసం గతంలో గల్లీలో తవ్వకాలు చేపట్టి, అనంతరం పనులు పూర్తి చేయకుండా వదిలివేయడంతో చిన్నారులు, వృద్ధులు తరచూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయిందని, తవ్విన గుంతలను సైతం తమ సొంత ఖర్చులతో పూడ్చుకున్నామని పేర్కొన్నారు. 28వ వార్డు ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని హనుమాన్ బస్తీకి మిషన్ భగీరథ పైప్లైన్ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యను పరిష్కరించకపోతే గల్లీలోనే కాకుండా మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పసులేటి వెంకటేష్, చేను విజయ, మాటేటి రాజ్యలక్ష్మి, మాటేటి రాధా, పసులేటి రాధ, ముదురకోళ్ల రాజవ్వ, ముద్రకోళ్ల లావణ్య, ఖమ్మం భూదేవి, నాగిశెట్టి రాణి, నాగిశెట్టి రమా, ఇప్పకాయల రాజేశ్వరి, కలగనూరి సరిత, మాటేటి స్వరూపతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});