మందమర్రి ఏరియాలో జయశంకర్ జయంతి వేడుకలు
నివాళులర్పించిన అధికారులు, ఉద్యోగులు
మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దివంగత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే నిజమైన ఘన నివాళి అని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. గురువారం మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో చైతన్యపరిచి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా జయశంకర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, తెలంగాణ వనరుల దోపిడిని శాస్త్రీయ దృక్పథంతో ప్రజలకు వివరించడంలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని రాధాకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి, చివరి శ్వాస వరకు తెలంగాణ ధ్యేయంగా జీవించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఇలాంటి మహనీయుడి జయంతిని మందమర్రి ఏరియాలో నిర్వహించుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలింద్ర సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏరియా ఉన్నతాధికారులు, సీనియర్ పీఓ సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});