CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 6:48 pm Posted By: coalbelt 24 News

మందమర్రిలో రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి ప్రతీక బోనాల జాతర
నూతన మడేలేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి బోనాల సమర్పణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన సంస్కృతికి, కులవృత్తుల ఆత్మగౌరవానికి బోనాల జాతర ప్రతీక అని మందమర్రి రజక సంఘం అధ్యక్షులు గంగరాజుల రామచందర్ అన్నారు. బుధవారం మందమర్రి మార్కెట్‌లో నిర్వహించిన బోనాల జాతర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులదైవమైన మడేలేశ్వర స్వామి ఆశీస్సులు, గ్రామదేవతల కరుణాకటాక్షాలతో రజక కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రజక వృత్తి దారులందరూ సంఘటితంగా ఉండి తమ సాంప్రదాయాలు, భక్తి భావాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. 1979లో ప్రారంభమైన రజకుల బోనాల జాతరలో భాగంగా 2026లో కేకే–5 ఫిల్టర్ బెడ్ సమీపంలో నూతనంగా నిర్మించిన కులదైవమైన మడేలేశ్వర స్వామి ఆలయంలో తొలిసారిగా బోనాలు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పట్టణంలోని అన్ని కుల సంఘాలు సహకరిస్తే భవిష్యత్తులో జాతరను మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం మందమర్రి పట్టణానికి చెందిన 165 కుటుంబాల మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని, చేతుల్లో యాపరిల్లలు ధరించి మార్కెట్ ప్రాంతం నుంచి పురవీధుల గుండా స్టేషన్ రోడ్డులోని పోచమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మూడో జోన్‌లోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద రజక సంఘ సభ్యులందరూ ఏకమై, కేకే–5 ఫిల్టర్ బెడ్ సమీపంలోని నూతన మడేలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని వందలాది బోనాలతో ప్రత్యేక జాతర నిర్వహించారు.

భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భాజా భజంత్రీలు, డీజే వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలతో మందమర్రి పురవీధులు కళకళలాడగా, జాతర భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. తమ కులదైవమైన మడేలేశ్వరయ్యకు మొక్కులు చెల్లించిన భక్తులు ఆనందోత్సాహాలతో తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగేపు హనుమంతు, ప్రధాన కార్యదర్శి రాగుల రాములు, కోశాధికారి మామిడి రమేష్, చల్ల బద్రి, గుడికందుల సమ్మయ్య,, పెనుగొండ సమ్మయ్య,, కళావతి, తిరుపతి, పైతర్ సీను, గుడి ఓదెలు, గొడ్డుపల్లి సారయ్య,, బుక్కెర అంజి, కొత్తకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});