CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 10:38 pm Posted By: coalbelt 24 News

22 ఏళ్ల తర్వాత ఇస్సానగర్‌లో ఊరడమ్మ పండుగ

గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా అంగరంగ వైభవంగా వేడుకలు
గ్రామ శ్రేయస్సు కోసం అమ్మవారికి ప్రత్యేక మొక్కులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇస్సానగర్ గ్రామంలో గ్రామదేవత ఊరడమ్మ పండుగను 22 ఏళ్ల అనంతరం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని చిన్నా, పెద్దా, మహిళలు, పురుషులు, వృద్ధులు అనే తేడా లేకుండా వేలాదిగా హాజరై భక్తిశ్రద్ధలతో పండుగలో పాల్గొన్నారు. రెండు దశాబ్దాలకుపైగా ఇలాంటి ఉత్సవాన్ని చూడని గ్రామస్తులు ఉత్సాహంగా వేడుకలను జరుపుకోవడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామస్తుల ఐక్యత, సామరస్యం కొనసాగాలని, ప్రతి ఏడాది ఈ పండుగను నిర్వహించేలా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని, సుఖశాంతులు నెలకొనాలని గ్రామదేవతను భక్తులు వేడుకున్నారు. వచ్చే ఏడాది కూడా ఇదే ఉత్సాహంతో ఊరడమ్మ పండుగను నిర్వహిస్తామని మొక్కులు చెల్లించారు. పండుగలో భాగంగా డప్పు దరువులు, జంబిక సప్పులు, పోతరాజుల విన్యాసాలు, ఆటపాటలతో ఊరేగింపులు నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొమ్మిడి నర్సారెడ్డి, ఉప్పునూతల నాగరాజ్ గౌడ్, మన్నే లింగయ్య, ఎక్కలదేవి సత్తయ్య, పొట్టిగారి పొట్టయ్య, పెద్ద మ్యాతరి, కర్రోళ్ల ఎల్లయ్యతో పాటు బైగరి, కుమ్మరి, సాకలి, బైండ్ల వర్గాల ప్రతినిధులు, పోతరాజులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ ధర్మగారి రాజా గౌడ్, ఉపసర్పంచ్ పొట్టిగారి రేణుక, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. గ్రామ ప్రజల సహకారంతో 22 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ ఉత్సవం ఇస్సానగర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});