సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు సిద్ధం?
హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు సన్నాహాలు..
అవసరమైతే ఆర్టికల్-136 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన..
హైడ్రా దూకుడు కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యంగా చర్చ
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా (HYDRAA) వ్యవహారంలో కమిషనర్ ఐఏఎస్ అధికారి ఏవీ రంగనాథ్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, బడా రియల్ ఎస్టేట్ మాఫియాపై హైడ్రా చేపట్టిన చర్యల్లో రంగనాథ్ కీలక పాత్ర పోషించగా, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా వ్యవహరించిన అధికారిగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
హైడ్రా చర్యలతో నష్టపోయిన పలువురు కోర్టును ఆశ్రయించగా, ఈ కేసు విచారణలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఏవీ రంగనాథ్ను తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పును వెంటనే అమలు చేయకుండా, చట్టపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో రిట్ అప్పీల్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే కోరుతూ, హైడ్రా స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని, దాని అధిపతి నియామకం ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తన వాదనల్లో ప్రస్తావించే అవకాశం ఉంది.
ఒకవేళ డివిజన్ బెంచ్లోనూ అనుకూల తీర్పు రాకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్-136 కింద స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైడ్రా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థ అని, ఒక నిర్దిష్ట వివాదంలో క్షమాపణ చెప్పిన నేపథ్యంలో అధికారిని మార్చాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసమనే అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉందని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం విశ్వసనీయ అధికారులను చట్టపరమైన మార్గాల్లో రక్షించడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని భావిస్తున్న అధికార వర్గాలు, హైడ్రా చర్యల వేగం తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించే దిశగా అడుగులు వేస్తోందని పేర్కొంటున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});