CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:14 pm Posted by : coalbelt 24 News

కామన్వెల్త్ గేమ్స్‌లో జ్ఞానేశ్వరి యాదవ్‌కు రజతం

భారత్‌కు ఐదో పతకం..
మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుత ప్రదర్శన
కేవలం 7 కేజీల తేడాతో చేజారిన స్వర్ణం

కోల్ బెల్ట్ న్యూస్ స్పోర్ట్స్;




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి ఐదో పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోటీల్లో ఆమె మొత్తం 199 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.

ఈ విభాగంలో నైజీరియాకు చెందిన ఒనోమి ఒమోలోల మొత్తం 206 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా, కెనడాకు చెందిన రెబెక కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.పోటీలో జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత పోరాట పటిమ కనబరిచింది. స్నాచ్ విభాగంలో తొలి రెండు ప్రయత్నాల్లో 82 కేజీలు, 85 కేజీలు విజయవంతంగా ఎత్తిన ఆమె, మూడో ప్రయత్నంలో 88 కేజీలు ఎత్తి తన ప్రతిభను చాటింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్‌లో 103 కేజీలు, 105 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి, చివరి ప్రయత్నంలో 111 కేజీలు విజయవంతంగా ఎత్తింది. దీంతో మొత్తం 199 కేజీల స్కోరుతో రజత పతకాన్ని దక్కించుకుంది.

స్వర్ణ పతక విజేత ఒనోమి ఒమోలోల స్నాచ్‌లో 93 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు ఎత్తి మొత్తం 206 కేజీల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 7 కేజీల తేడాతో జ్ఞానేశ్వరి స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆమె ప్రదర్శన భారత క్రీడాభిమానులను గర్వపడేలా చేయడం విశేషం. జ్ఞానేశ్వరి యాదవ్ సాధించిన ఈ రజత పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది. భారత వెయిట్‌లిఫ్టర్ల వరుస విజయాలతో దేశానికి మరోసారి గర్వకారణమైన ప్రదర్శన లభించింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});